31-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పుణ్యాత్మగా అవ్వాలంటే మీ లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి - ఏ పాపము జరగటం లేదు కదా, సత్య ఖాతా జమ అయి ఉందా?’’

ప్రశ్న:-
అన్నింటికన్నా పెద్ద పాపము ఏది?

జవాబు:-
ఎవరిపైనైనా చెడు దృష్టి ఉంచడము - ఇది అన్నింటికన్నా పెద్ద పాపము. పుణ్య ఆత్మగా తయారవుతున్న పిల్లలైన మీరు ఎవరిపైనా చెడు దృష్టిని (వికారీ దృష్టిని) ఉంచకూడదు. చెక్ చేసుకోవాలి - నేను ఎంతవరకు యోగములో ఉంటున్నాను? ఏ పాపము చేయడం లేదు కదా? ఉన్నత పదవిని పొందాలంటే జాగ్రత్త వహించండి - కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండకూడదు, తండ్రి ఏ శ్రీమతాన్ని అయితే ఇస్తారో, దానిపై పూర్తిగా నడుస్తూ ఉండండి.

పాట:-
ముఖాన్ని చూసుకో ఓ ప్రాణీ...

ఓంశాంతి
అనంతమైన తండ్రి తన పిల్లలతో - పిల్లలూ, మీ అంతరంగాన్ని కాస్త పరిశీలించుకోండి అని అంటారు. నేను జీవితమంతటిలోనూ ఎంత పాపము చేసాను, ఎంత పుణ్యము చేసాను - అన్నది మనుష్యులకు తెలుస్తుంది. ప్రతి రోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి - ఎన్ని పాపాలు చేసాను, ఎంత పుణ్యము చేసాను, ఎవరినీ నొప్పించలేదు కదా? ప్రతి మనిషీ అర్థం చేసుకోగలడు - నేను జీవితములో ఏమేమి చేశాను, ఎంత పాపము చేశాను, దానపుణ్యాలు మొదలైనవి ఎంత చేశాను? అని. మనుష్యులు యాత్రలకు వెళ్ళినప్పుడు దానపుణ్యాలు చేస్తారు, ప్రయత్నించి పాపాలు చేయకుండా ఉంటారు. తండ్రి పిల్లలనే అడుగుతున్నారు - ఎన్ని పాపాలు చేసారు, ఎంత పుణ్యము చేసారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్మగా అవ్వాలి. ఏ పాపమూ చేయకూడదు. పాపాలు కూడా అనేక రకాలవి ఉంటాయి. ఎవరివైపుకైనా చెడు దృష్టి వెళ్తే, అది కూడా పాపమే. చెడు దృష్టి అనేది వికారాలకు సంబంధించే ఉంటుంది. ఇది అన్నింటికన్నా చెడ్డది. ఎప్పుడూ కూడా వికారీ దృష్టి వెళ్ళకూడదు. చాలా వరకు పతి, పత్నికి మధ్యన వికారీ దృష్టియే ఉంటుంది. కుమార, కుమారీలలో కూడా ఎక్కడో అక్కడ వికారీ దృష్టి ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ వికారీ దృష్టి ఉండకూడదు. లేకపోతే మిమ్మల్ని కోతి అని అనవలసి వస్తుంది. నారదుని ఉదాహరణ ఉంది కదా. నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగారు! మేము లక్ష్మిని వరిస్తాము, నారి నుండి లక్ష్మిగా, నరుని నుండి నారాయణునిగా అవుతామని మీరు కూడా అంటారు కదా. తండ్రి అంటారు, మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - ఎంతవరకు నేను పుణ్యాత్మగా అయ్యాను? ఏ పాపమూ చేయడం లేదు కదా? ఎంతవరకు యోగములో ఉంటున్నాను?

పిల్లలైన మీరైతే తండ్రిని గుర్తించారు, అందుకే ఇక్కడ కూర్చున్నారు కదా. ప్రపంచములోని మనుష్యులు బాబాను చూసినప్పుడు, వీరు బాప్ దాదా అని గుర్తించలేరు. పరమపిత పరమాత్మ బ్రహ్మాలోకి ప్రవేశించి మనకు అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానాను ఇస్తారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మనుష్యుల వద్ద వినాశీ ధనము ఉంటుంది, దానినే దానము చేస్తారు, అవి రాళ్ళ వంటివి. ఇవి జ్ఞాన రత్నాలు. జ్ఞానసాగరుడైన తండ్రి వద్దనే రత్నాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. రత్నాకరుడైన తండ్రి నుండి జ్ఞాన రత్నాలను ధారణ చేసి తిరిగి ఆ రత్నాలను దానము చేయాలి. ఎవరు ఎంతగా తీసుకుంటారో మరియు ఇస్తారో, వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీ లోపల చూసుకోండి - నేను ఎన్ని పాపాలు చేశాను? ఇప్పుడు ఇక ఏ పాపము జరగడం లేదు కదా? కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండకూడదు. తండ్రి ఏ శ్రీమతాన్ని అయితే ఇస్తారో, దానిపై పూర్తిగా నడుస్తూ ఉండాలి, ఆ జాగ్రత్త వహించాలి. మాయా తుఫానులు వచ్చినా కానీ కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మలూ చేయకూడదు. ఎవరివైపైనా చెడు దృష్టి వెళ్తే వారి ఎదురుగా నిలబడకూడదు కూడా, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. వీరికి చెడు దృష్టి ఉంది అని తెలిసిపోతుంది. ఒకవేళ ఉన్నత పదవిని పొందాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు దృష్టి ఉంటే చేతులు లేనివారిగా, కాళ్ళు లేనివారిగా అయిపోతారు. తండ్రి ఏ శ్రీమతాన్ని అయితే ఇస్తారో, దానిపై నడవాలి. తండ్రిని పిల్లలే గుర్తించగలరు. ఒకవేళ బాబా ఎక్కడికైనా వెళ్తే, బాప్ దాదా వచ్చారు అని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇతర మనుష్యులు ఎంతోమంది చూస్తారు కానీ వారికి తెలియదు. వీరు ఎవరు? అని ఎవరైనా అడిగినా కూడా, వీరు బాప్ దాదా అని చెప్పండి. బ్యాడ్జి అయితే అందరి వద్దా తప్పకుండా ఉండాలి. శివబాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశీ జ్ఞాన రత్నాలను దానం ఇస్తున్నారని చెప్పండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మిక తండ్రి, సర్వాత్మల తండ్రి కూర్చుని ఈ జ్ఞానాన్ని ఇస్తారు. శివ భగవానువాచ. గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అన్నది తప్పు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అని శివుడినే అంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఈ పదాలన్నింటినీ పూర్తిగా గుర్తుంచుకోవాలి. మాకు తండ్రి తెలుసు అని ఇప్పుడు పిల్లలు భావిస్తారు మరియు తండ్రి కూడా నాకు పిల్లలు తెలుసు అని భావిస్తారు. వీరందరూ నా పిల్లలే, కానీ నన్ను తెలుసుకోలేరు అని తండ్రి అయితే అంటారు కదా. భాగ్యములో ఉంటే మున్ముందు తెలుసుకుంటారు. ఒకవేళ బాబా ఎక్కడికైనా వెళ్తే, వీరు ఎవరు అని ఎవరైనా అడిగితే, తప్పకుండా శుద్ధ భావనతోనే అడుగుతారు, అప్పుడు వీరు బాప్ దాదా అని చెప్పండి. అనంతమైన తండ్రి నిరాకారుడు. వారు ఎప్పటివరకైతే సాకారములోకి రారో, అప్పటివరకు వారసత్వము ఎలా లభిస్తుంది. కావున శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుని వారసత్వాన్ని ఇస్తారు. వీరు ప్రజాపిత బ్రహ్మా మరియు వీరు బి.కె.లు. చదివించేవారు జ్ఞానసాగరుడు. వారి నుండే వారసత్వము లభిస్తుంది. ఈ బ్రహ్మా కూడా చదువుకుంటారు. వీరు బ్రాహ్మణుడి నుండి మళ్ళీ దేవతగా అవ్వనున్నారు. ఇది అర్థం చేయించడం ఎంత సహజము. ఎవరికైనా బ్యాడ్జిపై అర్థం చేయించటం మంచిది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా చెప్తున్నారు అని చెప్పండి. పావనముగా తయారై పావన ప్రపంచములోకి వెళ్ళిపోతారు. వీరు పతిత-పావనుడైన తండ్రి కదా. మనము పావనముగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము. వినాశన సమయము వచ్చినప్పుడు మన చదువు పూర్తి అయిపోతుంది. ఇది అర్థం చేయించడం ఎంత సహజము. ఎవరైనా ఎక్కడైనా వెళ్తూ-వస్తూ ఉన్నా సరే, బ్యాడ్జి మీతోపాటు ఉండాలి. ఈ బ్యాడ్జితోపాటు ఒక చిన్న కరపత్రము కూడా ఉండాలి. అందులో ఇలా వ్రాసి ఉండాలి - భారత్ లోకి తండ్రి వచ్చి మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు, మిగిలిన అనేక ధర్మాలన్నీ ఈ మహాభారత యుద్ధము ద్వారా కల్పపూర్వము వలె, డ్రామా ప్లాన్ అనుసారముగా అంతమైపోతాయి. ఇటువంటి కరపత్రాలు 2-4 లక్షలు ముద్రించబడి ఉండాలి, తద్వారా ఎవరికైనా కరపత్రాలను ఇవ్వవచ్చు. పైన త్రిమూర్తి చిత్రము ఉండాలి, ఇంకొకవైపు సెంటర్ల చిరునామాలు ఉండాలి. పిల్లలకు రోజంతా సేవా ఆలోచనలు నడుస్తూ ఉండాలి.

పిల్లలు పాట విన్నారు - ఈ రోజు మొత్తములో మా అవస్థ ఎలా ఉంది అని రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. రోజూ రాత్రివేళ తమ రోజంతటి లెక్కను కూర్చుని వ్రాసుకునేవారిని ఎంతోమందిని బాబా చూశారు. ఏ చెడు పనీ చేయలేదు కదా అని వారు చెక్ చేసుకుంటారు. మొత్తం వ్రాస్తారు. మంచి జీవిత చరిత్ర వ్రాసి ఉన్నట్లయితే తర్వాతవారు కూడా దానిని చదివి నేర్చుకుంటారని భావిస్తారు. ఇలా వ్రాసుకునేవారు మంచి వ్యక్తులే ఉంటారు. కానీ అందరూ వికారులుగానే ఉంటారు. ఇక్కడైతే ఆ విషయము లేదు. మీరు మీ లెక్కాపత్రాన్ని రోజూ చూసుకోండి, తర్వాత బాబా వద్దకు దానిని పంపించాలి, అప్పుడు ఉన్నతి బాగుంటుంది మరియు భయము కూడా ఉంటుంది. అంతా స్పష్టముగా వ్రాయాలి - ఈ రోజు నాకు చెడు దృష్టి కలిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది.. అని. ఎవరైతే ఇతరులకు దుఃఖాన్ని ఇస్తారో, వారిని బాబా దుఃఖమిచ్చేవారు అని అంటారు. జన్మజన్మాంతరాల పాపాలు మీ తలపై ఉన్నాయి. ఇప్పుడు మీరు స్మృతి బలముతో పాపాల భారాన్ని దించుకోవాలి, అందుకే రోజూ చూసుకోవాలి - నేను రోజంతటిలో ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా. దీని వలన పాపము తయారవుతుంది. తండ్రి అంటారు, పిల్లలూ, ఎవరికీ దుఃఖము ఇవ్వకండి. స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోండి - నేను ఎంత పాపము చేశాను, ఎంత పుణ్యము చేశాను. ఎవరు కలిసినా, అందరికీ ఈ మార్గము తప్పకుండా చెప్పవలసిందే. తండ్రిని స్మృతి చేయాలి మరియు పవిత్రముగా అవ్వాలి అని అందరికీ చాలా ప్రేమగా చెప్పండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. మీరు సంగమములో ఉన్నా కానీ, ఇదైతే రావణరాజ్యమే కదా. ఈ మాయావీ విషయ వైతరిణీ నదిలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. కమల పుష్పము ఎన్నో పిల్లమొక్కలు కలిగి ఉంటుంది. అయినా అది నీటికి పైనే ఉంటుంది. అది గృహస్థీ, అది ఎన్నింటినో పుట్టిస్తుంది. ఈ ఉదాహరణ మీ కొరకు కూడా ఉంది, మీరు వికారాల నుండి దూరముగా ఉండండి. ఈ ఒక్క జన్మ పవిత్రముగా ఉంటే ఇక అది అవినాశీ అయిపోతుంది. మీకు తండ్రి అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తారు. మిగిలినవన్నీ రాళ్ళే. వారందరూ భక్తి విషయాలనే వినిపిస్తారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అయితే ఒక్కరే, కావున ఇటువంటి తండ్రి పట్ల పిల్లలకు ఎంత ప్రేమ ఉండాలి. తండ్రికి పిల్లల పట్ల, పిల్లలకు తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలిన వారెవ్వరితోనూ సంబంధము లేదు. ఎవరైతే తండ్రి ఇచ్చే మతముపై పూర్తిగా నడవరో, వారు సవతి పిల్లలు. రావణుడి మతముపై నడిస్తే ఇక రాముడి మతము ఎక్కడ ఉన్నట్లు. అర్ధకల్పము రావణ సాంప్రదాయము ఉంది, అందుకే దీనిని భ్రష్టాచారీ ప్రపంచము అని అంటారు. ఇప్పుడు మీరు మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రి మతముపై నడవాలి. బి.కె. యొక్క మతము లభించినా, ఆ మతము సరైనదా కాదా అని చెక్ చేయవలసి ఉంటుంది. పిల్లలైన మీకు తప్పు-ఒప్పుల జ్ఞానము కూడా ఇప్పుడే లభించింది. ఎప్పుడైతే సత్యమైనవారు వస్తారో, అప్పుడే తప్పు-ఒప్పుల గురించి తెలియజేయగలరు. తండ్రి అంటారు, మీరు అర్ధకల్పము ఈ భక్తి మార్గపు శాస్త్రాలను విన్నారు, ఇప్పుడు నేను మీకు ఏదైతే వినిపిస్తున్నానో, అది రైటా లేక అవి రైటా? ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారు అంటారు, నేనేమో నేను మీ తండ్రిని అని అంటాను. ఇప్పుడు ఎవరిది రైట్ అనేది జడ్జ్ చేయండి. ఇది కూడా పిల్లలకే అర్థం చేయించడం జరుగుతుంది కదా, ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. రావణ సాంప్రదాయము వారైతే చాలామంది ఉన్నారు, మీరు చాలా తక్కువమంది ఉన్నారు. అందులోనూ నంబరువారుగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉన్నా వారిని రావణ సాంప్రదాయులు అని అంటారు. ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దివ్యముగా మారుతుందో అప్పుడు వారు రామ సాంప్రదాయులుగా భావించబడతారు. తమ అవస్థ ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా. ఇంతకుముందైతే జ్ఞానము లేదు, ఇప్పుడు తండ్రి మార్గాన్ని తెలియజేసారు. కావున చూసుకోవాలి, నేను అవినాశీ జ్ఞాన రత్నాల దానాన్ని చేస్తూ ఉంటానా? భక్తులు వినాశీ ధనాన్ని దానం చేస్తారు. ఇప్పుడు మీరు అవినాశీ ధనాన్ని దానం చేయాలి, అంతేకానీ వినాశీ ధనాన్ని కాదు. ఒకవేళ వినాశీ ధనము ఉన్నట్లయితే దానిని అలౌకిక సేవలో ఉపయోగిస్తూ వెళ్ళండి. పతితులకు దానం చేయడం వలన పతితులుగానే అయిపోతారు. ఇప్పుడు మీరు మీ ధనాన్ని దానం చేస్తే, దానికి ప్రతిఫలము 21 జన్మల కొరకు కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవలసినవి. బాబా సేవ యొక్క యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు. అందరిపైనా దయ చూపించండి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని గానం చేయబడింది కూడా. కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. పరమాత్ముడినే సర్వవ్యాపి అనేసారు. పిల్లలు సేవా అభిరుచిని చాలా బాగా పెట్టుకోవాలి. ఇతరుల కళ్యాణము చేస్తే స్వయం యొక్క కళ్యాణము కూడా జరుగుతుంది. రోజురోజుకు బాబా చాలా సహజము చేస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తి చిత్రమైతే చాలా మంచిది. ఇందులో శివబాబా కూడా ఉన్నారు, అలాగే ప్రజాపిత బ్రహ్మా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీల ద్వారా మళ్ళీ భారత్ లో 100 శాతము పవిత్రతా-సుఖము-శాంతుల దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధము ద్వారా కల్పపూర్వము వలె వినాశనమైపోతాయి అని ఇటువంటి కరప్రతాలను ముద్రించి పంచాలి. బాబా ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ప్రదర్శనీలో కూడా కరపత్రాలను ఇవ్వండి. కరపత్రాల ద్వారా అర్థం చేయించడం సహజము. పాత ప్రపంచ వినాశమైతే అవ్వవలసిందే. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతూ ఉంది. మిగిలినవన్నీ కల్పపూర్వము వలె వినాశనమైపోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా జేబులో కూడా కరపత్రాలు మరియు బ్యాడ్జీలు ఎల్లప్పుడూ ఉండాలి. క్షణములో జీవన్ముక్తి అని గానం చేయబడింది. వీరు తండ్రి, వీరు దాదా అని చెప్పండి. ఆ తండ్రిని స్మృతి చేయడము ద్వారా ఈ సత్యయుగ దేవతా పదవిని పొందుతారు. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన, కొత్త ప్రపంచమైన విష్ణుపురిలో మళ్ళీ వీరి రాజ్యముంటుంది. ఎంత సహజము. తీర్థయాత్రలు మొదలైన చోట్లకు మనుష్యులు వెళ్తారు, ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఆర్యసమాజము వారు మొదలైనవారు కూడా ట్రైన్ నిండుగా వెళ్తారు. దీనిని ధర్మము పేరు మీద ఎదురుదెబ్బలు అని అంటారు, కానీ వాస్తవానికి ఇది అధర్మము పేరు మీద ఎదురుదెబ్బలు. ధర్మము పేరు మీదనైతే ఇలా ఎదురుదెబ్బలు తినవలసిన అవసరము లేదు. మీరైతే చదువు చదువుకుంటున్నారు. భక్తి మార్గములో మనుష్యులు ఏమేమి చేస్తూ ఉంటారు!

ముఖాన్ని చూసుకో ప్రాణి... అని పిల్లలు పాటలో కూడా విన్నారు. ముఖాన్ని ఈ రకముగా మీరు తప్ప ఇంకెవ్వరూ చూసుకోలేరు. భగవంతునికి కూడా మీరు చూపించవచ్చు. ఇవి జ్ఞానము యొక్క విషయాలు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి అసలు తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారు - ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకైతే అంతా తెలుసు. ఎవరి బుద్ధికైనా బాణము తగిలితే వారి నావ తీరానికి చేరుకుంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒకవేళ వినాశీ ధనము ఉన్నట్లయితే దానిని సఫలము చేసేందుకు అలౌకిక సేవలో ఉపయోగించాలి. అవినాశీ ధనము యొక్క దానము కూడా తప్పకుండా చేయాలి.

2. తమ లెక్కాపత్రములో చూసుకోవాలి - నా అవస్థ ఎలా ఉంది? మొత్తం రోజంతటిలో ఎటువంటి చెడు పని జరగడం లేదు కదా? ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా? ఎవరిపైనా చెడు దృష్టి వెళ్ళడం లేదు కదా?

వరదానము:-
డబుల్ లైట్ గా అయి సర్వ సమస్యలను హైజంప్ చేసి దాటివేసే తీవ్ర పురుషార్థీ భవ

సదా స్వయాన్ని అమూల్య రత్నముగా భావిస్తూ బాప్ దాదాల హృదయము రూపీ డిబ్బీలో ఉండండి, అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉండండి, అప్పుడు ఏ విషయములోనూ కష్టమును అనుభవం చేయరు, అన్ని భారాలు సమాప్తమైపోతాయి. ఈ సహజ యోగము ద్వారానే డబుల్ లైట్ గా అయి పురుషార్థములో హైజంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఎప్పుడైనా ఏదైనా కష్టము అనుభవమైతే, తండ్రి ఎదురుగా కూర్చుండిపోండి మరియు బాప్ దాదా యొక్క వరదానాల హస్తాన్ని స్వయముపై అనుభవం చేయండి, దీని ద్వారా క్షణములో సర్వ సమస్యల పరిష్కారము లభిస్తుంది.

స్లోగన్:-
సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది, ఇదే రక్షణ యొక్క కోట.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చెయ్యండి

సమయమనుసారముగా నలువైపులా సకాష్ ను ఇచ్చే, వైబ్రేషన్లను ఇచ్చే, మనసా ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే కార్యము చెయ్యాలి. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరమే ఉంది. ఏ విధంగా సాకార రూపములో చూసారు - ఏదైనా ఇటువంటి అలతో కూడిన సమయము వచ్చినప్పుడు రాత్రింబవళ్ళు సకాష్ ను ఇవ్వడము, బలహీనముగా ఉన్నవారిలో బలాన్ని నింపడము పట్ల అటెన్షన్ ఉండేది. సమయాన్ని కేటాయించి ఆత్మలకు సకాష్ ను ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. అలా ఫాలో ఫాదర్ చేయండి.